ప్రాణహిత పుష్కరాల సమయం ఆసన్నమవుతోంది. బృహస్పతి మీనరాశిలో ప్రవేశించే వేళ 2022 ఏప్రిల్ 13 నుంచి 24 వరకు 12 రోజుల పాటు ప్రాణహిత నదికి పురస్కారాలు నిర్వహిస్తారు. ఇప్పటికే దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖలతో సమావేశాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాలు సందర్శించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పుష్కరాలకు కుమురంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహట్టి, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, జయశంకర్ భూపాలపలి జిల్లా కాళేశ్వరం వద్ద ఇతర అనువైన ప్రాంతాల్లో ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. స్నానఘట్టాలు, చలువ పందిళ్లు, దుస్తులు మార్చుకునే గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, రహదారులు, ఆర్టీసీ బస్సులు, భద్రతా, తదితర ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి దేవాదాయ ధర్మాదాయశాఖకు పంపించారు.
ప్రాణహిత పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నదని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయరామారావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తరువాత మొదటిసారి పుష్కరాలు జరుగుతుండటంతో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు, వీవీఐపీలతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నదని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామన్నారు.














