తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ఫలిచింది. చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతమైన యాదాద్రి దివ్యక్షేత్రం సాక్షాత్కారించింది. నవ్య యాదాద్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. జయజయ ధ్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ శాస్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. శోభాయాత్ర, విమాన గోపురాలకు పవిత్ర జలాలతో అభిషేకం, ఆలయ ప్రవేశం జరిగిన సమయంలో నమో నారసింహ మంత్రం ప్రతి ధ్వనించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.














