ఆస్ట్రేలియాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మెల్బోర్న్లో భారతీయులు అధికంగా నివసించే ప్రాంతంలో ఏర్పాటు చేసిన గాంధీ కాంస్య విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గాంధీ కాంస్య విగ్రహాన్ని కట్ చేసిన వారిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. దొంగతనానికి గురైన విగ్రహాన్ని కనుగొని, బాధ్యులను వదలొద్దని ఢిల్లీలోని ఆస్ట్రేలియా దౌత్యాధికారులకు తేల్చి చెప్పింది.

మెల్బోర్న్లో భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే రోవ్విల్లే ప్రాంతంలోని గాంధీ కాంస్య విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. అంతటితో ఊరుకోకుండా విగ్రహాన్ని పాదాలు మాత్రమే ఉంచి, కాళ్ల వరకు కట్ చేసి ఎత్తుకెళ్లారు అగంతకులు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ఇండియన్ కమ్యూనిటీ స్థానిక విక్టోరియా పోలీసులకు ఫిర్యాదు చేసింది.















