సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ తెలుగు కార్మిక సోదరులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సింగపూర్ తెలుగు సమాజం ఎల్లప్పుడూ వారికి అండగా ఉందన్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా తనతో పాటు తన కార్యవర్గం ఎప్పుడూ వారికి అండగా ఉంటామని మరోసారి భరోసా ఇచ్చారు. రెండేళ్ల తర్వాత అందరినీ భౌతికంగా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా అంతా ధౌర్యంగా, కలిసికట్టుగా ఉంటూ చేతనైనంతలో సహాయం చేద్దామని పిలుపునిచ్చారు.
1200 మంది కార్మికులకు స్ఠానిక రెస్టారెంట్ల సహకారంతో బిర్యానీ బాక్సులు అందిచినట్టు సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు, కార్యక్రమ నిర్వాహకులు కిరిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి తెలిపారు. అన్ని వేళలా కార్మిక సోదరులకు అండగా ఉంటూ ఈనాటి కార్యక్రమాన్ని పర్యవేక్షించి విజయవంతం కావడానికి సహకరించిన కార్యవర్గ సభ్యులు పోతగాని నరిసింహగౌడ్, నాగరాజుల సేవలను ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు అభినందించారు.
ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్తో పాటు సింగపూర్ తెలుగు సమాజం పూర్వ, ప్రస్తుత కార్యవర్గ సభ్యులంతా కార్మిక సోదరలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగువారికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించి కార్యవర్గ సభ్యులు, దాతలు, సహకరించిన రెస్టారంట్ యాజమాన్యాలకు సింగపూర్ తెలుగు సమాజాం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.