తెలంగాణ రాష్ట్రం దేశానికి తలమానికంగా మారిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బ్రిటన్ తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాల పండగకు సంబంధించిన బ్రోచర్ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఘనమైన పాలనను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచిందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పారిశ్రామికంగా ప్రపంచ దేశాలలో ఖ్యాతి పొందుతోందన్నారు. ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏడాదిన్నరలోగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
కేసీఆర్ ఉద్యమదీక్ష, పట్టుదల, పోరాటం వల్ల తెలంగాణ సిద్ధించిందన్నారు. రాష్ట్రాన్ని సీఎం అద్బుతంగా అభివృద్ధి చేశారు. సీఎం కేసీఆర్ పథకాలు, కార్యక్రమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకొస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా తెలంగాణ అంటే ప్రత్యేకంగా గౌరవిస్తున్నారు. బోనాలు, బతుకమ్మ పండగలను నేడు అనేక దేశాలలో నిర్వహించడం మనకెంతో గర్వకారణం అన్నారు. ప్రవాసులు తెలంగాణకు రాయబారులుగా వ్యహరిస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారు.














