ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం నిబంధనలు కఠినం చేసింది. విదేశాల నుంచి అమెరికా చేరుకునే ఆ దేశ పౌరులు, విదేశీయులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలంటూ జో బైడెన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. గత వారం కాలిఫోర్నియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన అమెరికా ఆరోగ్య, వైద్య విభాగం వెంటనే ప్రభుత్వానికి కొన్ని సూచనలు జారీ చేసింది. వీటి ప్రకారం విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. విదేశాల నుంచి అమెరికాకు చేరుకునే వారు తమతో పాటు 24 గంటల ముందు జారీ చేసిన కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. గతంలో 72 గంటలుగా ఉన్న నిబంధనను ఒక రోజుకి కుదరించారు. గడిచిన పద్నాలుగు రోజులుగా దక్షిణాఫ్రికాతో పాటు ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రయాణించిన వారికి అమెరికాలో ఎంట్రీ లేదు. అయితే అమెరికన్ సిటిజన్లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. విమానాశ్రయాల్లో కోవిడ్ టెస్టులకు తప్పనిసరిగా హాజరు కావాలి విమానంతో పాటు బస్సు, రైలు, క్యాబ్లలో సైతం మాస్కు ధరించాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు. మార్చి 18 వరకు ఈ రూల్ కొనసాగుతుంది.
…………