బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా వీరసింహారెడ్డి. శృతిహాసన్ నాయికగా నటించింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్లో చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ చిత్రానికి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా నాకొక గుర్తుండే ప్రయాణం అయ్యింది. సినిమాలో సీమ నేపథ్యం కనిపించింది. ఇలాంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తుండటం వల్లే సంతోషంగా ఉండగలుగుతున్నా. నాకు బసవతారకం ఆస్పత్రి, హిందూపురం నియోజకవర్గం, సినిమాలు తప్ప మరో ఆలోచన ఉండదు. టీమ్ అందరికీ ఈ సినిమా విజయం ఘనత దక్కుతుంది. మరిన్ని మంచి చిత్రాల్లో నటించే ప్రోత్సాహాన్ని ఈ సినిమా అందించింది్ణ అన్నారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో బాలకృష్ణ గారితో వీరసింహరెడ్డి సినిమా చేసిన అవకాశం రావడం నా అదృష్టం. శతజయంతి ఉత్సవాలు ఒక పండగలా వుంటే, వీరసింహరెడ్డి మరో పండగ తీసుకొచ్చింది. మా సినిమాని ఇంతపెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి రుణపడి వుంటాను అని అన్నారు.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన బాలకృష్ణ గారికి, దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా ఎనిమిది రోజుల్లోనే బాలకృష్ణ గారి హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇంకా లాంగ్ రన్ వుంది. సినిమా ఇంకా చాలా దూరం వెళుతుంది. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాతలు నవీన్, వై. రవిశంకర్, నాయికలు వరలక్ష్మీ శరత్కుమార్, హనీ రోజ్, సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్నారు.














