68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో ఎంపికైంది. అలాగే ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో నాట్యం.. ఉత్తమ సంగీత చిత్రంగా.. అల వైకుంఠపురములో చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. ఉత్తమ నటుడిగా అవార్డును ఇద్దరు పంచుకున్నారు. సూరారైపోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా)లో నటనకు గానూ సూర్య, తానాజీ లో నటనకు అజయ్ దేవగణ్లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటిగా అపర్ణాబాలమురళి (సూరారైపోట్రు)ని అవార్డు వరిచింది.
ఈ ఏడాది మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్స్ ఎంట్రీకి వచ్చాయి. అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో 148 చిత్రాలు (20 భాషల్లో) స్క్రీనింగ్ వచ్చినట్లు జ్యూరీ మెంబర్స్ తెలిపారు. ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్ (28 కేటగిరీలు), నాన్ ఫీచర్ ఫిల్మ్స్ (22 కేటగిరీలు), బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడు: సూర్య (సూరారై పోట్రు), అజయ్ దేవగణ్ (తానాజీ), ఉత్తమ నటి అపర్ణ బాలమురళి (సూరారై పోట్రు), ఉత్తమ చిత్రం సూరారై పోట్రు (సుధాకొంగర), ఉత్తమ దర్శకుడు: దివంగత సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియుం), ఉత్తమ సహాయ నటి లక్ష్మి ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్ సిలా పెంగళం), ఉత్తమ సహాయ నటుడు బిజూమేనన్ (అయ్యప్పనుమ్ కోషియుం). మోస్ట్ ఫ్రెండ్లీ ఫిల్మ్ స్టేట్ అవార్డును ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్లు సొంతం చేసుకున్నాయి. బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డును ద లాంగెస్ట్ కిస్ (కిష్వర్ దేశాయ్) దక్కించుకుంది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మరోసారి ప్రకటించనున్నట్లు జ్యూరీ మెంబర్స్ తెలిపారు.














