ఇండియన్ పీపుల్స్ ఫోరం (దుబాయ్) తెలంగాణ కౌన్సిల్ ఆధ్వర్యంలో దుబాయ్లోని ఆల్కుజ్ ప్రాంతంలోని అంబాసిడర్ స్కూల్లో తెలంగాణ గల్ఫ్ కార్మికులతో ఆత్మీయ సమ్మేశనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ విదేశీ వ్యవహారాల శాఖ ఇంఛార్జి డాక్టర్ విజయ్ చౌతైవాలే, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇండియన్ పీపుల్ ఫోరం యూఏఈ అధ్యక్షుడు జితేంద్ర వైద్య అధ్యక్షత వహించారు. ఫోరం ప్రధాన కార్యదర్శి రంజీత్ కోడోత్ అతిథిగా పాల్గొన్నారు. ఫోరం తెలంగాణ విభాగం అధ్యక్షుడు కుంభాల మహేందర్ రెడ్డి స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ బుర్జ్ ఖలీఫాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇళ్లు కొనుక్కొంటూ తెలంగాణ నాయకులు కొందరు ధనవంతులయితే పేద ప్రజలు మాత్రం గూడు కోసం విదేశాలకు వస్తున్నారని అన్నారు.
తెలంగాణ ప్రజలతో పాటుగా విదేశాలలో ఉంటున్న తెలంగాణ బిడ్డలను కూడా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ తన శుష్క వాగ్దానాలతో దగా చేసారని విమర్శించారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల సమస్యలన్ని కూడా పరిష్కారం చేస్తామని ఆయన హామనిచ్చారు. ప్రవాసీ భీమా యోజన పథకం కింద గల్ఫ్ ప్రవాసీయుల దాదాపు సమస్యలకు పరిష్కారం ఉందని కానీ దీన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి అమలు చేయడంలో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేవలం 275 రూపాయాలతో బీమా కింద ప్రవాసీయులకు, స్వదేశంలోని వారి కుటుంబాలకు వైద్య సదుపాయంతో పాటు గల్ఫ్లో న్యాయ సహాయం వరకు అన్ని రకాల ముఖ్య సేవలను కేంద్రం అందిస్తుందని ఆయన వివరించారు. మోదీ ప్రధానిగా కాకుండా ఒక పేదవాడిగా అలోచించడంతో ఈ రకమైన సేవలను ప్రవాసీ బీమా యోజన కింద తీసుకువచ్చారని అన్నారు. గల్ఫ్ దేశాలలో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు అసలు సమస్యలే కావని, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉండాలని పెర్కోన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న తన కాల్ సెంటర్ ద్వారా వేలాది మందికి తాను ఒక్కడ్ని సహాయం చేయగల్గినప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయరాదని ఆయన ప్రశ్నించారు. గల్ఫ్ దేశాల నుండి తాను ఇప్పటి వరకు 4,700 తెలంగాణ ప్రవాసీయులను స్వదేశానికి రప్పించానని, అదే విధంగా తన ఫౌండేషన్ ద్వారా 1700 మంది రోగులకు వైద్య సహాయం అందించానని అన్నారు. దుబాయిలో రాజకీయ పార్టీల పేరు ప్రస్తావించ రాదని కానీ తాను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకందరికి అర్ధమయి ఉంటుందని చెబుతూ ఆయన పరోక్షంగా విమర్శలు చేసారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో విదేశీ వ్యవహారాల విభాగం నెలకొల్పడం జరిగిందని అందులో నలుగురు సభ్యులుండగా దక్షిణాది రాష్ట్రాల నుండి తనను ఎంపిక చేసారని అరవింద్ తెలిపారు. సభ జరుగుతుండగా, నమాజు వేళ కావడంతో అజాన్ మొదలు కాగా ప్రధాని మోదీ తరహా తాను కూడా నమాజును గౌరవిస్తూ ప్రసంగాన్ని ఆపుతున్నట్లుగా ప్రకటించి ఆజాన్ జరిగినంత వరకు మౌనంగా ఉన్నారు.
ఈ సమావేశంలో కటుకం రవి, వంశీ గౌడ్, నవనీత్ పటేల్, శరత్ గౌడ్, మదన్, జగదీశ్, గోవర్ధన్, వినోద్ ఆర్మూరీ, కోరేపు మల్లేష్, పెంకుల ఆశోక్, దీపికా శ్రీనివాస్, రమేష్ గదార్ల, మేగీ కృష్ణహరి, రేండ్ల శ్రీనివాస్తో పాటు సుమారు 1300 మంది గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు.