తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హింస, ఘర్షణలు, ప్రేరేపించే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారారు. మతపరమైన హింస చెలరేగే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని భయపెట్టి, మోసం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇలాంటి సీఎంని ఎక్కడా చూడలేదని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో హింస ప్రేరేపిత చర్చలు లేవని, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణ బిడ్డలు బీజేపీ పై పౌరుషాన్ని చూపడం కాదని, కల్వకుంట్ల కుటుంబ పాలనపై చూపించాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్న టీఆర్ఎస్ నేతలను ఉరికించాలన్నారు. కుడివైపు అసదుద్దీన్ ఒవైసీ, ఎడమవైపు అక్బరుద్దీన్ ఒవైసీలను పెట్టుకుని మత హింస గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంతో 44.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి ఒప్పందం చేసుకుని ఇప్పటి వరకు 30.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, ఇంకా 14.25 లక్షల మెట్రిక్ టన్నులకు ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు, ఢల్లీి చుట్టూ తిరుగుతూ బీజేపీపై విమర్శలు చేసే సమయాన్ని సీఎం, మంత్రులు ధాన్యం కొనుగోలుకు వెచ్చించాలన్నారు.














