దేశం గర్వపడేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన కొనసాగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా అన్నారు. ఆస్ట్రేలియలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నారైల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ నవరత్న పథకాలతో ప్రతి పేదవాని ఇంట నేడు వెలుగులు విరజిమ్ముతోందని ప్రతిక్షణం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఉండడం తోనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి నాయకుడంటే ఇలా ఉండాలని జగన్ మోహన్ రెడ్డి నిరూపించారు. తాను ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన అందరికీ అందుతున్నాయని లేదా అని తెలుసుకోవడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నారన్నారు. దీంతో పేద ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతోందన్నారు.
స్వదేశీ చదువులతో పాటు విదేశీ చదువులకు కూడా విదేశీ విద్య దీవెన ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు జగనన్న అన్నారు. ఆయనతో పాటు ఆయన స్థాపించిన పార్టీలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాం అన్నారు. 2024 లోను ఇలాంటి జనరంజకమైన పాలన కొనసాగడానికి ఎన్నారైలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ చింతల చెరువు సూర్య నారాయణ రెడ్డి, భరత్, బ్రహ్మారెడ్డి, రామంజి, మణిదీప్, తరుణ్, సతీష్ పాటి, మాజీ శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.