తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ లు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారని , బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల వెల్లడించారు. నిజామాబాద్లో అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మీడియా తో మాట్లాడుతూ తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు. కేసీఆర్ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఎన్ఆర్ఐలంతా సంఘీభావం తెలుపుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి 52 దేశాలకు చెందిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 2014, 2018 ఎన్నికల్లోనూ నిజామాబాద్ లో ప్రచారం చేశామని వివరించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశారని స్పష్టం చేశారు. 9 ఏండ్లలో నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వైకుంఠదామలు, ఐటీ హాబ్, సమీకృత కలెక్టర్ కార్యాలయం నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడం కోసం అనేక కంపెనీలు నిజామాబాద్ నగరానికి వచ్చాయని వివరించారు. ప్రజలంతా బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మచలం, బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ మాట్లాడుతూ తెలంగాణతో పాటు రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కేసీఆర్ దూర దృష్టి, ఆలోచన, ప్రణాళిక, నిబద్ధతకు నిదర్శనం అన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రైతుబంధు అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశములో చందు తల్లా , అశోక్ , నవీన్ , శ్రీనివాస్ జక్కిరెడ్డి , సతీష్ , అహ్మద్ , బిందు తదితరులు పాల్గొన్నారు.