అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన మీట్ విత్ మన్నవ మోహన కృష్ణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పునరుద్ధరణ దిశగా చంద్రబాబు చూపిస్తున్న నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రానికి సాంకేతికత, పారిశ్రామిక, ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం దూరదృష్టితో ఏపీ కొత్త దిశగా పయనిస్తోందన్నారు.


గూగుల్తో ఒప్పందం, క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్లు రాష్ట్రాన్ని ప్రపంచ సాంకేతిక కేంద్రంగా నిలబెడతాయని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ఎన్ఆర్ఐలు మన్నవ మోహన కృష్ణని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు, వ్యాపారవేత్తలు, అమెరికా టీడీపీ నాయకులు, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
















