మే 27న హైదారాబాద్లోని రవీంద్రభారతిలో బృందావనం సాంస్కృతిక, సేవ సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్ఆర్ఐలు చిమట శ్రీనివాస్, వై. సుబ్రహ్మణ్యం, సుంకరి శ్రీరామ్ ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీటీఏ బోర్డు చైర్పర్సన్, సీఈవో సుబ్బు కోట, విశిష్ట అతిథిగా తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఆత్మీయ అతిథిగా సినీ నటుడు వడ్డి నాగ మహేష్, గౌరవ అతిథులుగా యూఎస్ఏకు చెందిన ఏపీటీఏ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివస్ చందు, ఏపీటీఏ ఫండ్ రైజింగ్ చైర్మన్ ప్రత్తిపాటి వీరబాబు హాజరవనున్నారు.ఈ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ పర్సనల్ కాస్ట్యూమర్ యర్రంశెట్టి వాలేశ్వరరావు, సినీ రచయిత, ఫిల్మ్ జర్నలిస్ట్ పులగం చిన్ననారాయణను ఘనంగా సన్మానించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గానకోకిల పి.సుశీలకు ఆత్మీయ సత్కారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుశీల, జానకి పాడిన ఎన్టీఆర్ చిత్రాలకు సంబంధించిన మధురమైన గీతాలను పలువురు గాయనీగాయకులు ఆలపించనున్నారు. ఎన్టీఆర్ అభిమానులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.