క్రిస్మస్ పండుగ వేళ జరిగే ప్రయాణాలతో ఒమిక్రాన్ వేరియంట్ మరింత విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ తెలిపారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఫౌసీ మాట్లాడుతూ అసాధారణ రీతిలో ఒమిక్రాన్ వ్యాపిస్తున్నట్లు చెప్పడానికి సందేహించడం లేదని అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న తీరును గమనిస్తే అది దేశ ఆరోగ్యసేవలపై పెను ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇప్పుడు ఉన్న పరిస్థితులే కొనసాగితే, అప్పుడు హాస్పిటళ్లపై ఒత్తిడి మరింత పెరుగుతుందన్నారు. ప్రజలందరూ మాస్క్లు ధరించాలని, సోషల్ డిస్టాన్స్ పాటించాలన్నారు. వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు తీసుకోవాలని ఆయన ప్రజల్ని కోరారు. కరోనా మహమ్మారి వేళ అమెరికా ప్రభుత్వానికి ఆంథోని ఫౌసీ దిశానిర్దేశం చేస్తున్న విషయం తెలిసిందే.














