అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. శ్వేతసౌధంలోని ఓవెల్ ఆఫీస్లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత ఆయనతో మోదీ ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే తొలిసారి. శ్వేతసౌధంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. జో బైడెన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్ పరిణామాలపై మోదీ చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలతో పాటు వాతావరణ మార్పులపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ నాలుగు మిలియన్ల మంది ఇండో అమెరికన్లు తమ దేశాన్ని ప్రతి రోజూ బలోపేతం చేస్తున్నారన్నారు. అనేక సవాళ్లను పరిష్కరించుకోవడంలో అమెరికా, భారత్లు సహకరించుకోగలవని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా సంబంధాల్లో కొత్త అద్యాయాన్ని చూస్తున్నామని మోదీతో బైడెన్ అన్నారు.
ఇరు దేశాల వ్యాపార భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రపంచ క్షేమం కోసం సాంకేతికను వాడాలన్నారు. బైడెన్ హాయంలో ఇరు దేశాల బంధం మరింతగా బలోపేతం కావాలని కోరారు. బైడెన్తో ఈ సమావేశం ఎంతో కీలకమైందన్నారు. ఇరు దేశాలకు ఈ సమావేశం చాలా ముఖ్యమైందన్నారు. భారత్, అమెరికా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయన్నారు. ఇరు దేశాల వాణిజ్య బంధానికి ఎంతో ప్రాధాన్యం ఉందని మోదీ తెలిపారు.