స్నేహాచిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఆర్ నారాయణ మూర్తి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా యూనివర్సిటీ. ప్రస్తుతం విద్యావిధానంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నూతన నటీనటులతో మూవీని తెరకెక్కించారు. తాజాగా హైదరాబాద్ లో ఈ మూవీ టైటిల్ లోగోను పద్మశ్రీ బ్రహ్మానందం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ నారాయణమూర్తికి సినిమానే ప్రాణం. ప్రజా దర్శకుడు ఆయన. చలన చిత్రం అనే సముద్రం వంక అందరూ చూస్తే, ఆ సముద్రమే చూసే వ్యక్తి నారాయణమూర్తి. ఇవాళ చదువు కొనే రోజులు వచ్చాయి. విద్యను వ్యాపారం చేశారు. విద్యా వ్యవస్థలోని ఇలాంటి లోపాలను ప్రశ్నిస్తూ ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ మన దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించాను. సత్యానంద్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు ఈ చిత్రంలో నటించారు. విద్య, వైద్యం వంటి సేవా రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలని రాజ్యాంగం చెబుతున్నది. కానీ ఈ రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయమనే హామీలను ప్రధాని మోదీ నిలుపుకోవాలి అన్నారు.














