తెలంగాణ ప్రజల పూల పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. బతుకమ్మ విశ్వ వేదికపై తన గొప్పతనాన్ని చాటేందుకు సిద్ధమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ నెల 23న ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయిలోని బూర్జ్ ఖలీఫాపై, బతుకమ్మను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బూర్జ్ ఖలీపా మీద బతుకమ్మను ప్రదర్శించబోయే తెర స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది కావడం మరో విశేషం. ఒకేసారి దేశ, విదేశాలకు చెందిన లక్ష మంది బూర్జ్ ఖలీఫా స్క్రీన్ పై బతుకమ్మను వీక్షించనున్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మన సంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ కవిత ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
దుబాయిలో జరగబోయే ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది. 2004 జనవరి 6న 829.8 మీటర్ల ఎత్తు గల బుర్జ్ ఖలీఫా నిర్మాణం మొదలైంది. ఈ భవనంలో మొత్తం 163 అంతస్తులున్నాయి. అత్యంత వేగంతో వెళ్లే 57 అధునాతన సాంకేతికతతో కూడిన లిప్టులను అమర్చారు. అక్టోబరు 23 రాత్రి భారత కాలమానం ప్రకారం 9:40 గంటలకు మరోసారి 10:40 గంటలకు దుబయ్ లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియో ప్రదర్శించనున్నారు.














