రష్మిక మందన్న లీడ్ రోల్ చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం మైసా. రవీంద్ర పుల్లే దర్శకుడు. అన్ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత సురేశ్బాబు క్లాప్ ఇవ్వగా, రవికిరణ్ కోలా కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ని మేకర్స్కు అందజేసిన అగ్ర దర్శకుడు హను రాఘవపూడి, ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

గోండ్ తెగల నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందనున్నదని, ఇంతకు ముందెన్నడూ కనిపించని అవతారంలో ఇందులో రష్మిక కనిపించనున్నారని మేకర్స్ తెలిపారు. షూటింగ్ త్వరలో మొదలుకానున్నదని, శ్రేయాస్ పి.కృష్ణ ఈ సినిమాకు డీవోపీగా పనిచేయనున్నారని, మిగతా టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.















