Namaste NRI

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ ఇకలేరు

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌ (75) కన్నుమూశారు. హైదరాబాదలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగానూ,  ప్రముఖ హిప్నాటిస్ట్‌గానే ఆయన పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆయనకు భార్య జయ, కొడుకు ప్రశాంత్‌ ఉన్నారు.  1949లో బీవీ పట్టాభిరామ్ జన్మించారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. తండ్రి పేరు రావ్‌ సాహెబ్ భావరాజు సత్యనారాయణ. కౌమారదశలో కాలి వైకల్యం కారణంగా,  ఆత్మన్యూనతా భావాన్ని జయించేందుకు ఇంద్రజాలికుడిగా, రచయితగా తనను తాను తీర్చిదిద్దుకున్నా రు. కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ సమయంలో ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి వద్ద ఆ విద్యను నేర్చుకున్నారు. ఒకటి రెండు టాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు.

తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో పలు రచనలు చేశారు. ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడంతో పాటు తల్లిదండ్రుల అవగాహన సదస్సులు నిర్వహించారు. దూరదర్శన్‌లో అనేక మేజిక్ షోలు ఇచ్చారు. 1990లలో పలు పత్రికలో బాలలకు బంగారుబాట అనే శీర్షికలో అనేక మంది ప్రపంచ ప్రముఖుల జీవితచరిత్రలు గురించి వ్యాసాలు రాశారు. బాలజ్యోతి అనే బాలల పత్రికలో మాయావిజ్ఞానం పేరిట వ్యాసాలు రాశారు పట్టాభిరామ్‌.

పట్టాభిరామ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆ తర్వాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో పట్టా అందుకున్నారు. గైడెన్స్, కౌన్సిలింగ్, జర్నలిజంలో పీజీ డిప్లమా పూర్తి చేశారు. మానసిక శాస్త్రం, ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సెలింగ్, హిప్నోథెరపీలలో అమెరికా నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారు. ఒత్తిడిని జయించడం, వ్యక్తుల మధ్య సంబంధాలు, అసర్టివ్ నెస్, సెల్ఫ్ హిప్నాటిజం మొదలైన అంశాలపై భారత్‌ లోని అనేక ప్రాంతాలలో, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ దేశాల్లోనే అనేక వర్క్‌షాప్‌లు నిర్వహించారు. హిప్నోసిస్‌పై ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ని ప్రదానం చేసింది. నాష్‌విల్ల్, న్యూ ఆర్లియన్స్ నగర మేయర్లు గౌరవ పౌరసత్వం సైతం ప్రదానం చేశారు.

ప్రశాంతి కౌన్సెలింగ్‌ అండ్‌ హెచ్‌ఆర్‌డీ సెంటర్‌ను నెలకొల్పారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం, పోలీసు అకాడమీ, షార్ శ్రీహరి కోట, జుడిషియల్ అకాడమీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌, జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ, డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవనరుల సంస్థ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌, మచిలీపట్నం నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయతీ రాజ్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్, సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ స్కూల్, డీఆర్‌డీఎల్‌, డెల్‌, డెలాయిట్‌, రామకృష్ణ మఠం, రెడ్డిల్యాబ్స్, మహీంద్రా సత్యం, జీఈ, బేయర్ బయోసైన్స్, జేఎన్ టీయు అకాడమీ స్టాఫ్ కాలేజీ, ఉస్మానియా అకాడమీ స్టాఫ్ కాలేజీ, భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ (బెల్) ఇంకా ఎన్నో విద్యాసంస్థలకు గౌరవ సలహాదారుగా ఉన్నారు. వ్యక్తిత్వ వికాసం, మానవవిలువలు, మ్యాజిక్‌పై తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ భాషల్లో వందకుపైగా పుస్తకాలను ప్రచురించారు.

డాక్టర్ పట్టాభి రామ్ భౌతికకాయాన్ని జూలై 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఖైరతాబాద్‌లోని ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచుతారు. ఆయన అంత్యక్రియలు జూలై 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో జరుగుతాయి. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events