బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరం ఈ నేపథ్యంలో ప్రధాని రిషి సునాక్ మొదటి ప్రసంగంకు సంబంధించిన కొన్ని వివరాలు బయటకొచ్చాయి. ఈ ప్రసంగంలో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూకేలో విద్యార్థులకు 18 ఏళ్లు వచ్చే వరకు గణిత బోధన తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 16 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో ఉన్న సగం మంది యువత గణితాన్ని పాఠ్యాంశంగా ఎంచుకోవడం లేదన్నారు. మన పిల్లలకు ఇంతకుముందుతో పోలిస్తే, భవిష్యత్తులో ఉద్యోగాలకు అనలిటికల్ నైపుణ్యాల అవసరం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ నైపుణ్యాలు లేకుండా వారిని బయటకు పంపించడం వారిని నిరాశకు గురి చేస్తుందని, అందుకే 18 ఏళ్ల వయసు వరకు గణితం తప్పనిసరి అని తన ప్రసంగంలో రిషి సునాక్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
జీవితంలో తాను పొందిన ప్రతీ అవకాశం విద్య వల్లనే లభించిందని, అందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు తన ప్రసంగంలో చెప్పారు. ప్రతి చిన్నారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. సరైన ప్రణాళికతో దీనిని అందించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థలతో మనం పోటీ పడలేకపోవడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదని అన్నారు.