రష్యా, ఉక్రెయిన్ల మధ్య మొదలైన చర్చలు విఫలమయ్యాయి. బెలారస్ వేదికగా జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాలు తమ తమ వాదనలకే కట్టుబడి సాగాయి. ప్రత్యర్థి వర్గం చేసిన డిమాండ్లను ఇరు దేశాలు కూడా పరిగణనలోకి తీసుకున్న దాఖలా కనిపించలేదు. ఈ కారణంగా గంటల తరబడి సాగిన ఈ చర్చలు సింగిల్ తీర్మానం కూడా లేకుండానే ముగిశాయి. యుద్ధం మొదలైన రెండో రోజునే ఉక్రెయిన్లో తాము చర్చలకు సిద్ధమంటూ రష్యా అద్యక్షుడు పుతిన్ ఓ ప్రతిపాదన చేశారు. బెలారస్ వేదికగా ఉక్రెయిన్ చర్చలకు సిద్ధమైతే తమ దేశ ప్రతినిధి బృందాన్ని పంపుతామంటూ ఆయన ప్రకటించారు. రష్యా మిత్రదేశంగా ఉన్న బెలారస్లో చర్చలకు తొలుత విముఖత వ్యక్తం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ తర్వాత చర్చలకు సరేనన్నారు. ఈ క్రమంలో మొదలైన చర్చలకు ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులతో కూడిన బృందాలను చర్చలకు కూర్చుకున్నాయి. దాదాపు 3 గంటలకు పైగానే చర్చలు జరిపినా ఏ ఒక్క తీర్మానం లేకుండానే రెండు దేశాలు చర్చలను ముగించాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)