
నటుడిగా స్వర్ణోత్సవం జరుపుకుంటున్న డైలాగ్ కింగ్ సాయికుమార్కు 2024వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన కొమరం భీమ్ జాతీయ పురస్కారం వరించింది. ఈ విషయాన్ని సెలక్షన్ చైర్మన్ సి.పార్థసారధి ఐఏఎస్, కో-ఛైర్మన్ నాగబాల డి.సురేష్కుమార్లతో కూడిన కమిటీ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. గత 12 ఏండ్లుగా భారత కల్చరల్ అకాడమి, ఓం సాయితేజ ఆర్ట్స్, ఆదివాసి సాంస్కృతిక పరిషత్ సంయుక్త నిర్వహణలో ఈ అవార్డు అందిస్తున్నామని, గతంలో ఈ అవార్డును గీత రచయిత సుద్దాల అశోక్తేజ, అల్లాణి శ్రీధర్, డా.రాజేంద్రప్రసాద్, గూడ అంజయ్యలకు అందించామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 23న కొమరంభీమ్ జిల్లా, అసిఫాబాద్లోని ప్రమీలా గార్డెన్స్లో పురస్కార మహోత్సవం జరగుతుందని, ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వారు తెలియజేశారు.
