భక్తుల కోలాటాలు, కళాకారుల వాద్య విన్యాసాలు, జీయర్ స్వాముల మంగళ వచనాల నడుమ భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింత్ పరిధిలోని శ్రీరామనగరంలో శ్రీ రామానుజ స్వామి వారి సహస్రాబ్ది సమారోహ కార్యక్రమం రామానుజ వెయ్యేళ్ల వేడుక త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి సారధ్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీరామనగరంలో త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి ఆశ్రమం నుంచి పెరుమాళ్ల లక్ష్మీ నరసింహస్వామి వారి శోభయాత్ర అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు
ఈ క్రమంలో చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆహోబిల రామానుజ జీయర్ స్వామి, దేవనాథ రామానుజ జీయర్ స్వామి, రామచంద్ర రామానుజ జీయర్స్వామిల పర్యవేక్షణలో వేలాది మంది రుత్వికులు, పీఠాధిపతులు, ఆశ్రమ విద్యార్థుల శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్రోచ్చరణతో పల్లకిలో పెరుమాళ్లు యాగాశాలకు చేరుకున్నారు. శ్రీవైష్టవ సంప్రదాయం ప్రకారం ఈ యాత్ర ప్రారంభమై పెరుమాళ్లు యాగశాలకు చేరుకున్న అనంతరం యాగ, హోమాలకు శ్రీకారం చుట్టారు. అధ్యాత్మిక చరిత్ర పుటల్లో సువర్ణాక్షాలతో లిఖించబడే శ్రీరామానుజ సహస్రాబ్ది సమారంభం బుధవారం నుంచి ఈ నెల 14 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.














