పవిత్ర కార్తిక మాసం సందర్భంగా హాంకాంగ్లోని తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో సత్యనారాయణస్వామి వత్రం, కార్తిక వనభోజనాలు వేడుకగా సాగాయి. తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి ఆధ్వర్యంలో ఏటా హాంకాంగ్కు వచ్చే నూతన తెలుగు జంటలతో ఇక్కడ సత్యనారాయణస్వామి వ్రతం, వనభోజనాలు నిర్వహిస్తున్నారు. పత్రి భీమసేన తెలుగు జంటలతో సత్యనారాయణస్వామి వ్రతం చేపించారు. ఈ సందర్భంగా భీమసేన మాట్లాడుతూ.. దేశం కానీ దేశంలో తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. మన సంస్కృతి సంస్కారాలను విడిచిపెట్టకుండా సంకల్పంతో ఈ వ్రతం చేసిన నూతన జంటలకు అభినందనలు తెలిపారు. హిందూ దేవాలయ సిబ్బంది సహకారంతో నిర్వాహకులు సత్యనారాయణస్వామి వ్రతం పూజా మంటపాన్ని అందంగా అలంకరించారు.
ఈ సందర్భంగా తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు జయ పీసపాటి మాట్లాడుతూ.. సత్యనారాయణస్వామి వ్రతంతో పాటు, వనభోజనాల కార్యక్రమం ఏటా కొనసాగాలని ఆకాంక్షించారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ కార్యక్రమాలు జరగలేదని, మళ్లీ ఇప్పుడు సభ్యులందరూ కలిసి సత్యనారాయణవ్రతంతో పాటు కార్తిక వనభోజనాలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నట్లు తెలిపారు. వన భోజనాల్లో భాగంగా ఓ చిన్నారి పుట్టినరోజుతో పాటు, రెండు జంటలు తమ పెళ్లి రోజుని సభ్యులతో కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలుగువారితో కలిసి ఆనందంగా కార్తిక వనభోజనాల కార్యక్రమం నిర్వహించుకుకోవడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని పలువురు తెలిపారు.