రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా సౌదీ అరేబియా కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఈ మేరకు సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా సంభవించే రోడ్డు ప్రమాదాలపై తాజాగా కీలక ప్రకటన చేసింది. రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వాహనదారులకు ఇకపై భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఉంటుందని తెలిపింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎవరైనా చనిపోతే ఆ రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనదారుడికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.44.41లక్షల జరిమానా ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. అతివేగం, రాంగ్సైడ్ డ్రైవింగ్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం, ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ ఇలా పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు వేర్వేరు పెనాల్టీలు, జైలు శిక్షలు ఉంటాయని వివరించింది.














