సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్`2022లో విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధును సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించింది. సింగపూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింధుతో పాటు ఆమె తండ్రి వెంకట రమణను ఆ సంఘం ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ పీవీ సింధు తన ఆట తీరుతో భారతదేశంతో పాటు తెలుగువారందరూ గర్వించేలా చేసిందని, భవిష్యత్లో మరిన్ని కీర్తి శిఖరాలు అధిరోహించాలన్నారు. రానున్న కామెన్ వెల్త్, వరల్డ్ చాంపియన్ షిష్ లోనూ ఆమె విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం సింధూ మాట్లాడుతూ తనను సత్కరించిన సింగపూర్ తెలుగు సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలుసుకుని సింగపూర్లో నివసించే తెలుగువారికి చేస్తున్న సేవలను ఆమె కొనియాడారు. సింగపూర్ తెలుగు సమాజం జులై 31న నిర్వహించనున్న బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొననున్న క్రీడాకారులకు సింధు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సమాజం ఆగస్టు 13న సింగపూర్లో ఉండే తెలుగు వనితలకు మాత్రమే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న నారీ (లేడీస్ నైట్) కార్యక్రమాన్ని స్త్రీలు వినియోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.














