హాస్పటాలిటీ రంగంలో మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్న సింగపూర్ ఈ రంగంలోకి భారతీయ ఉద్యోగులకు అనుమతించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా రెస్టారెంట్లలో కుక్స్ కొరత తీర్చేనందుకు భారతీయ వంటవారిని కుక్స్గా నియమించుకునేందుకు అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతించింది. ఈ చర్యతో సేవారంగంతోపాటూ తయారీ రంగం కూడా లాభపడుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. భారతీయ వంటవారిని నియమించుకునే దిశగా ప్రత్యేక దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచీ రెస్టారెంట్లు తమ దరఖాస్తులను మానవవనరుల మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయచ్చని పేర్కొంది.ఈ చర్యతో భారతీయ రుచులు కూడా సింగపూర్లో మరింత విస్తృతస్థాయిలో అందుబాటులోకి వచ్చి టూరిజం రంగానికి ఊతమిస్తాయని అక్కడి రెస్టారెంట్ ఓనర్ల అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. తద్వారా, సింగపూర్ ఓ ప్రధాన పర్యాటక కేంద్రంగా కొనసాగేందుకు సాయపడు తుందని వెల్లడించింది. ఈ నిర్ణయంపై భారతీయ రెస్టారెంట్ ఓనర్లు కూడా హర్షం వ్యక్తం చేశారు. తమ కస్టమర్లకు అసలుసిసలైన భారతీయ రుచులను పరిచయం చేసే అవకాశం తమకు దక్కిందని కొందరు రెస్టారెంట్ ఓనర్లు మీడియాతో వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకూ సింగపూర్లోని సేవ, పారిశ్రామిక రంగాల్లో చైనా, తైవాన్, హాంగ్కాంగ్, మలేషియా, మకావు, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల వారినే ఉద్యోగంలోకి తీసుకునే వారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రెస్టారెంట్లలో భారతీయులతో పాటూ బంగ్లాదేశ్, మయాన్మార్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, థాయ్ల్యాండ్ వంటవారికి కూడా సింగపూర్ హాస్పటాలిటీ రంగంలోకి అనుమతి లభించింది. కాగా, భారతీయ వంటకాల నిపుణులు, ప్రభుత్వ అధికారులతో కూడిన ఓ కమిటీ భారతీయుల దరఖాస్తులను పరిశీలించి అనుమతులు జారీ చేస్తుంది.