ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా, ఎలాంటి ఉన్నత స్థితిలో ఉన్నా, అక్కడి సంస్కృతీ సంప్రదాయాలని గౌరవిస్తూనే , తమ దేహంలో అణువణువూ నిండిపోయిన భారతీయ సంస్కృతీ తెలుగు సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తుంటారు.ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో తెలుగు సంస్థలు ఉన్నా, ఎవరు ఎలాంటి కార్యక్రమాలని నిర్వహించినా అందరి ఆలోచన ఒక్కటే తెలుగు బాష, సంస్కృతీ సాంప్రదాయాలు, పండుగలు, భారతీయ కళలను అనుసరిస్తూ భవిష్యత్తు తరాలకు మార్గ నిర్దేశం చేయడమే.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/29102023nribrk1b.jpg)
తాజాగా కాకతీయ సాంస్కృతిక పరివారం సింగపూర్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కన్నుల పండుగగా జరిగింది. ఈ వ్రతంలో సింగపూర్లో ఉన్న 75 మంది తెలుగు దంపతులు పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని నోచుకొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు వ్రతం చేసుకోవడానికి కావాల్సిన పూజా ద్రవ్యాలు, స్వామి వారి రూపు, పటం భక్తులకు అందించారు. ఈ వ్రతానికి దాదాపు 400 మంది ప్రత్యక్షంగా తిలకించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. వ్రతం సింగపూర్ శ్రీ శ్రీనివాస్ పెరుమాళ్ ఆలయ ప్రాంగణంలో పీజీపీ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్ని ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించిన సంస్థ సభ్యులకు, నిర్వహణలో సహకరించిన వాలంటీర్లు, అన్నదానానికి సాయం చేసిన దాతలందరికీ కాకతీయ పరివారం కార్యనిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/29102023nribrk1c.jpg)