రంగారెడ్డి జిల్లా రావిర్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం పథకాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమం చేసినా దానివెనక మానవీయ కోణం ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం పేద పిల్లలకు వరమని చెప్పారు. దేశంలో ఇలాంటి అల్పాహార పథకం ఎక్కడాలేదన్నారు. ఇంగ్లిష్ మీడియంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. వెయ్యి గురుకులాలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆడపిల్ల చదువుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు.

ఈ పథకం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల తరుపున సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలకు పౌష్ఠికాహారం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. దేశంలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని, ఇది విద్యావ్యవస్థలో సమూల మార్పుతెస్తుందన్నారు.

సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. రుచి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.














