ప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందిన చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కథానాయికలు. అశ్వత్ మారిముత్తు దర్శకుడు. కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మాతలు. ఈ నెల 21న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడారు. ఓ మామూలు కుర్రాడు జీవితం లో ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నమే డ్రాగన్. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనేవుంటారు. అలా ప్రయత్నించే ప్రతి ఒక్కరి గుండెల్లో మా డ్రాగన్ నిలిచిపోతుంది. నా లవ్ టుడే ని బాగా ఆదరించారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నా అని అన్నారు.
దర్శకులు హరీశ్శంకర్, సాయిరాజేష్, కిశోర్ తిరుమల, నిర్మాత ఎస్కేఎన్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నిజంగా మంచి సినిమా. అందుకే విజయం పై నమ్మకం తో ఉన్నా అని దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలిపారు. యువతరం మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చేలా సినిమా ఉంటుందని నిర్మాత అర్చనా కల్పాతి చెప్పారు.
