మానవ అక్రమ రవాణ ఆరోపణలతో ఫ్రాన్స్లో నిర్బంధానికి గురైన రొమేనియన్ విమానం ఎట్టకేలకు ముంబై చేరింది. 303 మంది భారతీయులతో దుబాయ్ నుంచి నికరాగువా వెళ్తున్న లెజెండ్ ఎయిలైన్స్ విమానం ఈ నెల 22న ఇంధనం కోసం ఫ్రాన్స్లోని వాట్రీ విమానాశ్రయంలో దిగింది. అయితే విమానంలో మానవ అక్రమ రవాణా జరుగుతున్నదనే అనుమానంతో అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే భారత రాయబార కార్యాలయం జోక్యంతో సమస్య పరిష్కారం అయింది. దీంతో నాలుగు రోజుల నిర్బంధం తర్వాత ముంబైలోని విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అందులో 276 మంది భారతీయులు ఉన్నారు.
కొంతమంది ప్రయాణికులు భారత్కు తిరిగి రావడానికి ఇష్టపడకపోవడంతో విమానం ఆలస్యంగా బయలు దేరిందని అధికారులు తెలిపారు. ఇద్దరు మైనర్లతో సహా 25 మంది ప్రయాణికులు ఫ్రాన్స్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. భారతీయ ప్రయాణీకులు సెంట్రల్ అమెరికాకు చేరుకోవడానికి ఈ యాత్రను ప్లాన్ చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అక్రమ ఇమ్మిగ్రేషన్ రింగ్లో పాత్ర పోషించారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అక్రమ రవాణాలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని విమానయాన సంస్థ స్పష్టం చేసింది.