ఎయిర్ ఇండియా సంస్థ టాటా సన్స్ పరమైంది. పెట్టుబడుల ఉపసంహారణలో భాగంగా ఎయిర్ ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టగా స్పైస్ జేట్తో పాటు ఎయిర్ ఇండియా కూడా బిడ్ను దాఖలు చేసింది. రెండు బిడ్లను పరిశీలించిన కేంద్ర మంత్రుల బృందం చివరకు టాటా సన్స్కే మొగ్గు చూపింది. ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునేందుకు టాటా సన్స్ రూ.18,000 కోట్లను వెచ్చించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి తహిన్ కాంత పౌండే అధికారికంగా ప్రకటించారు.
1946లో టాటా సన్స్ ఏవియేషన్ విభాగం ఎయిర్ ఇండియాగా లిస్టయ్యింది. 1948లో యూరప్కు విమాన సేవలతో ఎయిర్ ఇండియా ప్రభుత్వ ఇంటర్నేషనల్ ఏర్పాటైంది. దేశీయంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యానికి ఈ ఇంటర్నేషనల్ సర్వీసే నాంది. అప్పట్లో ఈ సంస్థలో ప్రభుత్వానికి 49 శాతం, టాటాలకు 25 శాతం, మిగతా వాటా పబ్లిక్ దగ్గర ఉండేది. 1953లో ఎయిర్ ఇండియాను కేంద్రం జాతీయ చేసింది. 1990లు, 2000ల దాకా ఎయిర్ ఇండియా ఆధిపత్యం కొనసాగినా ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా రంగంలోకి దిగడం మొదలయ్యాక క్రమంగా ప్రాభవం తగ్గడం మొదలైంది. ఎయిర్ ఇండియా 2007 నుంచి నష్టాల్లోనే కొనసాగుతోంది.
భారీ రుణంతో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు 2017 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో కంపెనీని కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో కేంద్రం గతేడాది అక్టోబర్లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) నిబంధనలను సడలించింది. ఎయిర్ ఇండియాకు చెందిన మహారాజా మస్కట్తో ఎంతో ప్రాచుర్యం పొందింది. 2007 వరకు లాభాలో ఉన్న సంస్థ ఆ తర్వాత నష్టాలకే కేరాఫ్ అడ్రస్గా మారింది. దీంతో అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. చివరకు 68 ఏళ్ల తర్వాత తిరిగి టాటా గూటికే ఎయిర్ ఇండియా చేరింది. ప్రైవేటు పరం అయ్యేనాటికి ఎయిర్ ఇండియా రుణం రూ.60,074 కోట్లుగా ఉంది.