భాషా సంస్కృతులే భవిష్యత్తులో మన చిరునామాను తెలియజేస్తాయని, వాటిని కాపాడుకోవడమే తెలుగు భాష దినోత్సవ సంకల్పం అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని లండన్ తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రతి ఒక్కరికీ మాతృభాషను చేరువ చేయాలన్న గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అమ్మభాషను కాపాడుకునేందుకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశం స్వరాజ్యం సంపాదించుకున్న 75 ఏళ్లలో వివిధ దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో భారతీయులు భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా భారతీయులను బానిసలుగా చూసిన బ్రిటిష్ గడ్డ మీద భారతీయులకు ప్రస్తుతం అందుతున్న గౌరవాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది అని అన్నారు.
మన భాషా సంస్కృతులను కాపాడుకుంటూ ముందు తరాలకు చేరవేయాలన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ సంస్థకు అభినందనలు తెలియజేసిన వెంకయ్య నాయుడు కాలానుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు సాగుతున్న తీరు ఆదర్శనీయమని తెలిపారు. భాష అంటే మనం మాట్లాడే నాలుగు పలుకులే కాదు. మన పిల్లలకు మన భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దటం మాత్రమే గాక, మన పండగల్లోని పరమార్థాన్ని తెలియజేస్తూ వారిని ప్రోత్సహించాలని తెలిపారు. మన ప్రాచీన గ్రంథాల్లో మన సంస్కృతి మాత్రమే కాగా, సాంఘిక జీవనం కూడా భాగమై ఉందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ముందు తరాలకు అందజేయాలని స్పష్టం చేశారు.