
అమెరికన్ యూనివర్సిటీలలో భారతీయ విద్యార్థుల చేరిక అత్యంత దారుణంగా పడిపోయింది. అంతర్జాతీయ విద్యార్థుల పట్ల ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 70 శాతం క్షీణించినట్లు హైదరాబాద్లోని విద్యారంగ కన్సల్టెంట్లు చెప్పారు. వీసా అపాయింట్మెంట్ స్లాట్లు స్తంభించిపోవడం, వీసా తిరస్కరణ శాతం పెరిగిపోవడమే ఈ క్షీణతకు కారణంగా తెలుస్తున్నది. సాధారణంగా ప్రతి ఏటా ఈ సమయానికి అధిక శాతం మంది విద్యార్థులు తమ వీసా ఇంటర్వ్యూలు ముగించుకుని అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. ఈ ఏడాది ఇప్పటికీ తాము స్లాట్ తెరుచుకుంటుందేమోనన్న ఆశతో ప్రతిరోజు పోర్టల్పై రిఫ్రెష్ కొడుతున్నామని హైదరాబాద్కు చెందిన ఓవర్సీస్ కన్సెల్టెంట్ సంజీవ్ రాయ్ పేర్కొన్నారు. దశల వారీగా వీసా స్లాట్లను విడుదల చేస్తామని అమెరికా అధికారులు వాగ్దానం చేసినప్పటికీ అనిశ్చితి కారణంగా విద్యార్థులలో తీవ్ర ఆందోళన ఏర్పడుతున్నది.















