సంప్రదాయ ముస్లిం దేశమైన ఇరాన్ లో మహిళలపై అణచివేత కొనసాగుతోంది. తాజాగా మహిళల డ్రెస్ కోడ్ పై ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ (ముఖంపై ముసుగు) ధరించడానికి ఇష్టపడని మహిళలకు, వారికి వత్తాసు పలికేవారికి కూడా భారీగా శిక్షలు విధించేలా ఇరాన్ చట్టం అమలు లోకి తెచ్చింది. ఈ మేరకు పార్లమెంట్ బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. హిజాబ్ ధరించని మహిళలకు సేవలు అందించే వ్యాపారులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. గత ఏడాది హిజాబ్ వివాదం కారణంగా పోలీస్ కస్టడీలో మృతి చెందిన మహసాఅమిని (22) ఘటనకు సరిగ్గా ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇరాన్ ఈ బిల్లును తీసుకురావడం గమనార్హం. అయితే ఈ బిల్లు మతాధికార సంస్థ గార్డియన్ కౌన్సిల్ అంగీకారం పొందాల్సి ఉంది. అది జరిగాక ప్రాథమికంగా మూడేళ్ల పాటు బిల్లు అమలు లోకి వస్తుంది.