జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో మహమ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఇస్లాంను అవమానించి ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా ఉన్మాద చర్యలను భారత్ అనుమతించరాదని తాము కోరుతున్నామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజహిద్ పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్తపై అధికార బీజేపీ పార్టీ నేత వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తాలిబన్లు తెలిపారు.
ఈ క్రమంలోనే మతోన్మాదంపై భారత్కు తాలిబన్లు కీలక సూక్తులు వల్లించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రవక్తపై వ్యాఖ్యల విషయంలో భారత్పై విరుచుకుపడ్డారు. భారత్ ప్రధాని మోదీ నాయకత్వంలో ఇండియాలో మతసామరస్యం దెబ్బతింటోందని, ముస్లింలను అణిచివేస్తున్నారని దీన్ని ప్రపంచ దేశాలు గమనించాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పాక్ వ్యాఖ్యలు, ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. తాము అన్ని మతాలను గౌరవిస్తామని స్పష్టం చేసింది.