తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు ఇటీవల దుబాయ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. స్వదేశానికి రప్పించాలని పదిహేను రోజుల క్రితం మంత్రి కేటీఆర్ను సోషల్ మీడియా ద్వారా వారు వేడుకున్నారు. స్పందించిన మంత్రి.. యువకులను స్వదేశానికి రప్పించేందుకు చొరవ చూపారు. దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ అధికారులతో మాట్లాడి.. తన సొంత ఖర్చుతో ఆ యువకులు స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేశారు. వారు క్షేమంగా భారత్ చేరుకున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆ యువకులను.. బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ సురేష్ నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి తదితరులు కలుసుకున్నారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువకులను ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి పంపించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.