మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ చిత్రాన్ని సాహుగారపాటితో కలిసి చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాతలిద్దరూ విలేకరులతో ముచ్చటించారు. సుస్మిత కొణిదెల మాట్లాడుతూ నిర్మాతగా నా కెరీర్లో మైలురాయిలాంటి సినిమా ఇది. నాన్నతో ఈ సినిమా తీయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సంక్రాంతికి సకుటుంబ చిత్రంగా అలరిస్తుంది.ఈ సినిమాలో నాన్న తన వింటేజ్ ఛార్మ్ని గుర్తు చేస్తారు అని చెప్పారు.

ఈతరం వారు కూడా చిరంజీవి తాలూకు రియల్ మ్యాజిక్ను చూడబోతున్నారు. రౌడీ అల్లుడు సినిమా తరహాలో ఆయన చక్కటి కామెడీ పండించారని ట్రైలర్ చూసిన వారు చెబుతున్నారు. ఈ సినిమా కోసం నాన్న బరువు తగ్గడంతో పాటు ఫిట్నెస్పై బాగా శ్రద్ధ తీసుకున్నారు. చాలా స్లిమ్గా తయారయ్యారు. ఇక వెంకటేష్ పాత్ర ఇంపాక్ట్ ఫుల్గా ఉంటుంది. ఆయన ఎంట్రీ తర్వాత మరింత ఫన్గా మూవీ సాగుతుంది. సినిమాలకు సంబంధించిన నాన్న దగ్గరి నుంచి ప్రతీ రోజు ఓ పాఠం నేర్చుకోవచ్చు. నిర్మాతగా ఈ జర్నీలో చాలా విషయాల్ని తెలుసుకున్నా. అనుకున్నది సాధించాలంటే ప్రాణం పెట్టి పనిచేయాలని అర్థం చేసుకున్నా అన్నారు.















