నాగలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రవీంద్ర గోపాల హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా దేశం కోసం భగత్సింగ్. దేశ భక్తి నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ నటించారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ రవీంద్ర గోపాల ఈ చిత్రంలో 14 మంది స్వాతంత్య్ర సమరయోధుల పాత్రల్లో నటించాడు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటే గానీ ఇది సాధ్యం కాదు. దేశం కోసం ఆయన చేసిన సినిమా ఇది అన్నారు. రవీంద్ర గోపాల మాట్లాడుతూ ఒక మంచి చిత్రాన్ని తెరకెక్కించాలనే లక్ష్యంతో చేసిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా ట్రైలర్కు మంచి స్పందన వస్తున్నది. ఫిబ్రవరి 3న సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు.
ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్యాషన్ తో సినిమా చేశాను అనే పదం మనలో చాలా మంది ఏదో ఫ్యాషన్ కోసం వాడుతుంటారు. కానీ నిజంగా రవీంద్ర గారు దేశంకోసం భగత్ సింగ్ సినిమా ప్యాషన్ తో చేశారు. డబ్బు కోసమే సినిమా తీసే ఈ కాలంలో దేశం కోసం సినిమా చేయడం అభినందిదగ్గ విషయం. నేటి తరానికి గాంధీ, భగత్ సింగ్ అంటే ఎవరో తెలియని పరిస్థితి. కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తే ఎంతో మంది త్యాగఫలం, మన స్వాతంత్ర్యం అనే విషయం వారికి తెలుస్తుంది. దేశభక్తితో ఈ సినిమా తీసిన రవీంద్ర గారిని అభినందిస్తూ, ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించి ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో నిర్మించాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల. బాబ్జీ, ప్రమోద్ శర్మ, బల్లెపల్లి మోహన్, ఘంటాడి కృష్ణ, దర్శకుడు , నటుడు, నిర్మాత రవీంద్ర గోపాల తదితరులు పాల్గొన్నారు.