విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్. పా.రంజిత్ దర్శకత్వం. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 26న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. హైదరాబాద్లో టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ నేను నటించిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి సినిమాల తరహాలో తంగలాన్ ఓ విభిన్న చిత్రం. ఈ సినిమాలో జీవితం కనిపిస్తుంది అన్నారు. సినిమాల తాలూకు గ్లామర్ను ఏమాత్రం పాటించకుండా తెరకెక్కించిన చిత్రమిది. దర్శకుడు తనదైన ఫిలాసఫీ, దృక్పథాన్ని ఈ సినిమాలో చూపించారు. ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేశాను. రెండు పాత్రల్లో సహజంగా కనిపించేందుకు చాలా శ్రద్ధ తీసుకున్నా. పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన గొప్ప సినిమాల్లో ఇదొకటిగా నిలిచిపోతుంది అన్నారు.
దర్శకుడు పా.రంజిత్ మాట్లాడుతూ విక్రమ్ డైరెక్టర్స్ యాక్టర్. ఒక్కసారి స్క్రిప్ట్ అంగీకరించిన తర్వాత దర్శకుడు సెట్లో ఏది చెబితే అదే చేస్తాడు. ఆయనలో ఎలాంటి ఈగో ఉండదు. నా కెరీర్లో తంగలాన్ విభిన్న చిత్రమవుతుంది అని అన్నారు. తమిళ ప్రజలు తెలుగు సినిమాలను ఆదరించడం లేదన్నది తప్పుడు అభిప్రాయమని, బాహుబలి-2 తమిళనాట రెండేళ్లపాటు హయ్యస్ట్ గ్రాసర్గా రికార్డు కొనసాగించిందని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు కరుణకుమార్, వేణు ఊడుగుల, బాబి, సురేందర్ రెడ్డి, మధుర శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.














