తెలంగాణ ప్రజలు డబ్బులకు లొంగరని మరోసారి నిరూపించి, అద్బుత తీర్పు ఇచ్చారని, ఈ గెలుపు వారికే అంకితం చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ను కిషన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో హుజూరాబాద్ ఎన్నిక కీలక మలుపు కాబోతోందని అన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్లో చిత్తశుద్ధితో పోరాడిన పార్టీ బీజేపీ అని అన్నారు. ఉద్యమకారులకు నిజమైన వేదిక బీజేపీనే అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నిర్వహించబోయే సభకు విజయ గర్జన కాదు. కల్వకుంట్ల గర్జన అని పేరు పెట్టుకుంటే బాగుండేది అని అన్నారు.
బీజేపీలోకి ఉద్యమకారులు, కవులు, మేధావులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ప్రగతిభవన్లో తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, నిజమైన ఉద్యమకారులను టీఆర్ఎస్ నుంచి వెళ్లగొడుతున్నారని ఆరోపించారు.














