విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్నది. చిత్రీకరణ పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. తాజాగా ఈ సినిమాలో ఖుషి అంటూ సాగే మూడో పాటను విడుదల చేశారు. దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యం అందించిన ఈ పాటను స్వరకర్త అబ్దుల్ వాహబ్ స్వయంగా ఆలపించారు. నువ్వు కనపడితే ఖుషి..నీ మాట వినపడితే ఖుషి అనే పల్లవితో సాగిన ఈ పాటను మెలోడీ ప్రధానంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా గీతాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, ఫీల్గుడ్ లవ్స్టోరీగా ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర బృందం పేర్కొంది.
ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి.మురళి, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: శివ నిర్వాణ.ఖుషి. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు.