తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి (83) శనివారం రాత్రి హైదరాబాద్ కుషాయిగూడలో గుండెపోటుతో కన్నుమూశారు. రఘునాథ రెడ్డి కృష్ణా జిల్లా కుందేరులో జన్మించారు. తొలుత రంగస్థల కళాకారుడిగా రాణించారాయన. పునరపి జననం, సంధ్యాఛాయ, ధర్మో రక్షిత రక్షిత వంటి నాటకాల ద్వారా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు పొందారు. కళ్లు సినిమా ద్వారా రఘునాథ రెడ్డి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. సర్పయాగం, చీమలదండు, ఒరేయ్ రిక్షా, పోలీస్, ఎర్రోడు, సూర్యపుత్రులు, కలిసుందాం రా, ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించి మెప్పించారు.2018లో వచ్చిన సుబ్రహ్మణ్యపురం ఆయన నటించిన చివరి సినిమా. దాదాపు 350కిపైగా చిత్రాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు.

అనారోగ్య కారణాల వల్ల రఘునాథ రెడ్డి గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఏకైక కుమారుడు నెల రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. కుమారుడి మరణం ఆయన్ని మరింతగా క్రుంగదీసిందని, ఆ బాధలోనే తీవ్ర అనారోగ్యానికి గురై కాలం చేశారని తెలిసింది. ఇలా నెలల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, రఘునాథ్ రెడ్డికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రఘునాథ రెడ్డి మృతిపట్ల పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు.















