కెనడా లోని ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (ఓటీఎఫ్) ఆధ్వర్యం లో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. టొరంటో లోని జేసీఆర్ ఆడిటోరియం అజాక్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వెయ్యి మందికి పైగా తెలుగు కమ్యూనిటీ బంధుమిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ వేడుకలకు సమన్వయకర్తలు ప్రవీణ్ నీల, చంద్ర చల్లా ముఖ్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మహిళా సమన్వయకర్తలు- వరలక్ష్మి గంధం, ఝాన్సీ బదాపురి, గీత రెడ్డిచెర్ల, శ్రీదేవి నీల, శిరీష ఘట్టి, లావణ్య ఆలూరి, ఆకర్ష కస్తూరి జ్యోతి ప్రజ్వలనతో ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. అనంతరం కిషోర్ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రీజినల్ కౌన్సిల్ ఫర్ విట్బీ – స్టీవ్ యమాడ, మలీహా షాహిద్ హాజరయ్యారు. ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ ప్రత్యేక సందేశంతో తెలుగు ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అయిదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ. ఒంటారియో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తున్న ఆ సంస్థను కొనియాడారు.

భారతదేశ సంస్కృతి సంప్రదాయాలును భవిష్యత్ తరాలకు అందించాలనే ఆశయంతో ప్రవీణ్ నీల రచనా దర్శకత్వంలో, ప్రసాద్ ఘట్టి సాంకేతిక నైపుణ్యం తో పిల్లలందరూ ప్రదర్శించిన భక్త ప్రహ్లాదు పౌరాణిక దృశ్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకుల మన్ననలు పొందింది.

ఈ వేడుకల నిర్వహణకు చేయూత నిచ్చిన గెట్ హోమ్ రియాల్టీ (రఘు జూలూరి, రమేష్ గొల్లు, ఆనంద్ పేరిచర్ల), రామ్ జిన్నాల, సుష్మ వరదరాజన్, కల్పేష్ పటేల్, కృష్ణ కుమారి కోటేరు, జోయెల్ ప్రకాష్, పుష్పిందర్ గిల్, చంద్ర యార్లగడ్డ, రవికిరణ్ ఇప్పిలి, శాయంతన్ మహేషన్, డా. సౌజన్య కాసుల, మురళి కృష్ణ రాతేపల్లి, అబ్దేల్ బెనుటాఫ్, భరత్ కుమార్ సత్తి, తెలుగు ఫుడ్స్, హైదరాబాద్ హౌస్, మధురం, ఇంద్రప్రస్థ రెస్టారెంట్, రేడియో భాగస్వామి-మార్నింగ్ రాగ సభ్యులు సంకీర్తన, షాజన్ లను ఓటీఎఫ్ సమన్వయకర్తలు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఈ వేడుకల సందర్భంగా స్థానిక వర్తకులను ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసిన విక్రేత కేంద్రాలు ప్రేక్షకులను ఆకర్షించాయి.ఈ కార్యక్రమంలో ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సమన్వయకర్తలు శ్రీని ఇజ్జాడ, ప్రసాద్ ఘట్టి, చంద్ర చల్లా, దీప-నవీన్ సూదిరెడ్డి, మురళి రెడ్డిచెర్ల, వరలక్ష్మి గంధం, మంజూష చేబ్రోలు, భరత్ వేంకటాద్రి, ఝాన్సీ బదాపురి, మహీధర్ ఆలూరి, కళ్యాణ్ కస్తూరి, ప్రవీణ్ నీల మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రవీణ్ నీల మాట్లాడుతూ టొరంటో లో చలి వాతావరణం లో కూడా వెయ్యికి పైగా తెలుగు వారు పాల్గొనడం శ్లాఘనీయమే అన్నారు. అయిదుగంటల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఉచితంగా రుచికరమైన తెలుగింటి భోజనం, ఉగాది పచ్చడి, తినుబండారాలు, తేనీరు ఏర్పాటు చేయడం జరిగింది.
