వీసా గడువు ముగిసినా అమెరికా లో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీచేసింది. ఈ అంశంలో ఉల్లంఘనలకు పాల్పడితే ఎదుర్కోవాల్సిన తీవ్ర పరిణామాలను స్పష్టంగా వెల్లడించింది. వీసా రూల్స్ను ఉల్లంఘిస్తే బహిష్కరణ ముప్పు తప్పదని, అదేవిధంగా భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

టూరిస్ట్, స్టూడెంట్స్, వర్క్ పర్మిట్స్ సహా వివిధ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి అమెరికా ఎంబసీ ఈ హెచ్చరిక చేసింది. అమెరికా ప్రయాణంపై నిషేధం పడితే భవిష్యత్తులో అక్కడ చదువు, వృత్తి, వ్యక్తిగత అవకాశాలపై గణనీయమైన ప్రభావం పడనుంది. నిర్దేశిత గడువు ముగిసినా అనుకోని పరిస్థితుల కారణంగా దేశాన్ని వీడటంలో ఇబ్బందులు ఏర్పడితే.. చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా ఉండేందుకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ను సంప్రదించాలని ఎంబసీ అధికారులు సూచించారు.
