అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా సాగుతుంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ కెమ్ వేద ముందుకు వచ్చింది. శాండియాగో లోని సంస్థ కార్యాలయంలో మంత్రి కేటీఆర్తో జరిగిన సమావేశంంలో ఈ మేరకు ప్రకటన చేసింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రముఖ పరిశోధన సంస్థగా కెమ్ వేద కంపెనీకి పేరుంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్, పరిశ్రమలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరింతగా విస్తరించేందుకు 150 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ తెలిపింది. 45 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ ఈ రోజు 450 మందికి చేరిందని, దీనిని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. 8 ఎకరాల్లో రెండు చోట్ల తమ కార్యాకలాపాలు కొనసాగుతున్నాయని, తమ కంపెనీని ఇంత భారీగా విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాలసీలు, అక్కడ ఉన్న నాణ్యమైన మానవ వనరులు ప్రధాన కారణాలని తెలిపింది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.