ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో నిర్వహించబోయే మహిళా ఫోరం కార్యక్రమాలు వైవిద్యభరితంగా, ఆలోచన రేకెత్తించేలా, విలువైన సలహాలు సూచనల పరస్పర అవగాహనకు వేదికగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని తానా సభల మహిళా ఫోరం ఛైర్పర్సన్ అడ్లూరి శైలజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత తానా మహాసభల్లో నిర్వహించిన మహిళా కార్యక్రమాలకు కన్నా కాస్త విభిన్నంగా ఈసారి రెండు రోజుల కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు ఆమె తెలిపారు. రెండోరోజు కార్యక్రమాల్లో భాగంగా మహిళా సాధికారత, మూడోరోజు కార్యక్రమాల్లో ప్రవాస మహిళలు తమ జీవన విధానంలో అలవర్చుకోవల్సిన సంస్కరణలు అనే అంశాలపై ప్యానెల్ చర్చలు ఉంటాయని తెలిపారు. గృహహింస, మహిళా ఆరోగ్యం, స్థానిక రాజకీయాల్లో మహిళల పాత్ర, పాఠశాల కమిటీల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం, లైంగిక వేధింపులు, అంతరిక్షంలో మహిళలు వంటి వినూత్నమైన అంశాలపై ప్రసంగాలు, చర్చలకు ఈసారి జరిగే తానా సభల్లో మహిళా ఫోరం గొడుగు పడుతుందని ఆమె వెల్లడించారు.
మందలపు కవిత, మెడిది శైలజ, నాదెళ్ల విజయ, గనేశుల సుష్మ, అరసద భాను, పాలడుగు మంజీర, శ్రీ గురుసామి(నటి రాజసులోచన మనవరాలు-చికాగో డెమొక్రాటిక్ పార్టీ సభ్యురాలు)లు ఈ ఫోరం ప్రతినిధులుగా సేవలందిస్తారని, అధ్యక్షుడు అంజయ్య, కన్వీనర్ పొట్లూరి రవిల ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. తానా సభల్లో నిర్వహించే మహిళా ఫోరంకు హాజరయ్యే అతిథుల జాబితాలో శ్రీలీల, లయ, కౌసల్య, సునీత, అనసూయ, వ్యోమగామి బండ్ల శిరీష, డా.సుష్మ, చంద్రబోస్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. వివరాలకు https://tanaconference.org/ చూడవచ్చు.