ధనుష్ కథానాయకుడిగా నటించిన చిత్రం సార్. సంయుక్త మీనన్ కథానాయిక. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ విద్య, వైద్యం వంటి మౌలిక సౌకర్యాలు డబ్బుతో సంబంధం లేకుండా అందరికి అంటుబాటులో ఉండాలన్నది ప్రపంచం మనకు నేర్పుతున్న పాఠం. ఇదే సమస్యను ఈ సినిమాలో చర్చించాం అన్నారు. చదువు మనిషి జీవనశైలిని మార్చుతుంది. ఒక గుమస్తా కొడుకుని కలెక్టర్ చేయగలిగేది చదువు ఒక్కటే. మనిషి జీవితంలో గొప్ప ఆయుధమైన చదువుని డబ్బులేని కారణంగా దూరం చేయడం ఎంత వరకు సబబు అనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం. మధ్యతరగతి కుటుంబాల వారు ఉన్నత చదువులకు వెళ్లాలంటే చదువు ప్రతి అడుగుకు దూరమైపోతున్నది. ఆర్థిక తారతమ్యాల వల్ల చదువుల మధ్య గీతలు గీస్తున్నం. ఇప్పుడు ఎల్కేజీ నుంచే చదువు దూరమైపోతున్నది. ఈ సీరియస్ అంశాన్ని దర్శకుడు వెంకీ బలంగా ప్రశ్నించాడు అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో సముద్రఖని, తమన్, సాయికుమార్, హైపర్ ఆది, రామజోగయ్యశాస్త్రి , చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.