మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకొని, ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి సిత్తరాల సిత్రావతి, హే బుజ్జి బంగారం, లీలమ్మో విడుదలై విశేష ఆదరణ పొందాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ వరల్డ్కప్ ఫీవర్ ఎలా ఉందో చూస్తున్నాం కదా. ఇండియా మ్యాచ్ ఉన్నరోజు సినిమాల వసూళ్లు గణనీయంగా పడిపోతున్నాయి. పైగా రానున్నవి సెమీ ఫైనల్స్. ఇండియా కప్ గెలుస్తుందనే అంచనాల్లో అందరం ఉన్నాం. అందుకే ఈ టైమ్లో సినిమాను విడుదల చేయడం శ్రేయస్కరం కాదని, పంపిణీదారులతో చర్చించి నవంబర్ 10వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని నవంబర్ 24 న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమా బాగా వచ్చింది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో విడుదల చేయడం సబబుకాదని ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. కుటుంబ ప్రేక్షకులనే కాక, యూత్నీ, ముఖ్యంగా మాస్ని కూడా అలరించే సినిమా ఇదని దర్శకుడు శ్రీకాంత్ చెప్పారు.